భువనేశ్వర్: పవిత్ర స్నాన యాత్రలో ఆరాధ్య దైవం శ్రీ జగన్నాథుని నిలువెత్తు నిజ రూప దర్శనంతో తరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో భక్తజనులు తరలి వచ్చారు. బొడొ దండొ ప్రాంగణం జన సంద్రంగా మారింది. జై జగన్నాథ్ భక్త నినాదంతో పరిసరాలు మారుమోగి ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంది. ఆబాలగోపాలం స్వామి దర్శనం కోసం పరితపించి తరించారు. అత్యంత చేరువలో స్వామి ప్రత్యక్షం కావడంతో భక్తి భావోద్వేగాలు ధార్మిక భావాలకు అద్దం పట్టాయి. శాసీ్త్రయ నృత్య భంగిమల ఉల్లాసం, భజన, సంకీర్తనల ఆలాపన వీనుల విందు స్నాన యాత్రలో ఆధ్యాత్మిక చింతనకు ప్రేరణగా నిలిచాయి.
ఉపశమన సేవలు
నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ, విపత్కర పరిస్థితుల నిర్వహణలో తలమునకలయ్యే పోలీసు, అగ్ని మాపక దళం వంటి ప్రత్యేక వర్గాలు స్వామి దర్శనంలో నిస్సహాయులకు సాయం చేశారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అశేష భక్త జనానికి చన్నీటి సించనంతో కొత్త ఊపిరి పోయడంలో అగ్ని మాపక దళం చక్కటి సేవల్ని అందజేసింది.


