రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాద్యదైవం మజ్జిగౌరి అమ్మవారికి భక్తులు దానం చేసే హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మందిరం పరిచాలన కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, సభ్యులు ఆర్కే దలాయి, దేవేంద్ర బెహర, ఎండోమెంట్ కమిషన్ ఇన్స్పెక్టర్ పుష్పిత బెహర, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమక్షంలో మందిరం గర్భగుడి లోపల, మందిరం ప్రాంగణంలో ఉన్న మొత్తం 9 హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. స్థానికంగా గల వివిధ సేవా సంస్థలకు చెందిన మహిళలు లెక్కింపులొ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. నగదు రూపంలో వచ్చే హుండీ ఆదాయం 1,22,29,623, బంగారం 32 గ్రాములు, వెండి 1.300 కిలోలు వచ్చింది. విదేశీ కరెన్సీలు కూడా అమ్మవారి హుండీలో రావడం విశేషం. గత జనవరి 19వ తేదీన నిర్వహించిన హుండీల లెక్కింపులో రూ.కోటి 5 లక్షల 52 వేల 845 నగదు, 30 గ్రాముల బంగారం, 2.150 కిలోల వెండి లభించింది. ఈ సారి సేకరించిన నగదు, విలువైన విరాళాల లెక్కింపు పూర్తయిన అనంతరం మజ్జిగౌరి ట్రస్టు పేరుతో ఉన్న ఒడిశా గ్రామీణ బ్యాంకు ఖాతాలొ జమ చేయనున్నట్లు మందిరం పరిచాలన కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రాంతీయ మేనేజరు దేవేష్ రంజన్ ధర్, రాయగడ శాఖ మేనేజర్ విజయ్ కుమార్ బారిక్, బాజార్ శాఖ మేనేజర్ ప్రజ్ఞా రంజన్ రథ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
47 వినతుల స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి చేడంగా పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 47 వినతులను గిరిజనుల నుంచి స్వీకరించారు. భూ, రహదారి, తదితర సమస్యలపై వినతులు అందాయి. పలు సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖల అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అబివృద్ధి శాఖ అధికారి దశరాథి సరబు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు .


