జయపురం: మొక్కల సంరక్షణకు జయపురం సోషియల్ ఎన్విరల్మెంటల్, ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ఏడాది వనమహోత్సవ కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు పూనుకుంది. సీవా గత ఏడాది జయపురం సమితి గగణాపూర్ ఉద్యాన వనంలో నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డి, పనికిరాని మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. అలాగే మొక్కలకు గార్డులను ఏర్పాటు చేసి సస్యరక్షణ చర్యలను సోమవారం చేపట్టింది. ఈ కార్యక్రమంలో 15 మంది సీవా కార్యకర్తలతో పాటు ఎకంబా గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవా కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ఏడాది వనమహోత్సవంలో తమ సంస్థ గగణాపూర్ ప్రాంతంలో 2,100 వివిధ రకాల మొక్కలు నాటిందన్నారు. వాటిలో 1700 మొక్కలు జీవించి ఉన్నాయని చెప్పారు. మిగతావి తగిన యాజమాన్యం లేక చనిపోయాయని వెల్లడించారు. ఇక నుంచి మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొక్కలు చెట్లుగా ఎదిగేందుకు అవసరమైన ఎరువులతో పాటు క్రిమిసంహరణ మందులు వేసి సంరక్షణ చర్యలు చేపడతామన్నారు.


