జయపురం: కేశవ ప్రభాత్ జయపురం వారిచే స్థానిక సూర్యమహల్ ప్రాంగణంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయపురం స్వయం సేవక్ సంఘం పట్టణ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా భగవత్ ధ్వజానికి ప్రణామమిల్లిన తరువాత సత్య బిశాయి సంఘ ప్రార్ధనా గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యవక్త విష్ణుప్రసాద్ సాహు ఛత్రపది శివాజీ జీవితం, ఆదర్శం, సాహసం, సుపరిపాలన, హిందూస్వరాజ్య స్థాపనలో ఆయన నిర్వహించిన భూమిక, అందించిన సేవలు గురించి వివరించారు. సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ, స్వాభిమానం, దేశ సేవా భావాన్ని బలోపేతం చేయాలని స్వయం సేవక్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వయం సేవక్ సంఘ సభ్యులు సామూహిక సంగీతాలాపణలు, వ్యక్తిగత గీతాలాపనలు, వివిధ శారీరక విన్యాసాలు, వైదిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ దేశ సమైఖ్యతకు, సంస్కృతిక రక్షణ, సమాస సేవకు అంకితమౌతామని ప్రతిజ్ఞ చేశారు.


