భువనేశ్వర్: అశేష జన సందోహం మధ్య జరిగే శ్రీ జగన్నాథుని రథ యాత్రలో అపశృతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు భారీ కసరత్తు చేస్తోంది. శ్రీ మందిరం పాలక వర్గం, పూరీ జిల్లా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ, సహకార, సమన్వయంతో యాత్రని దిగ్విజయం చేసేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. యాత్ర దగ్గర పడుతున్న కొద్దీ అనుబంధ వర్గాల అప్రమత్తతని అనుక్షణం సమీక్షిస్తున్నారు. ప్రధానంగా రథాలు కదిలే సమయంలో ఊపిరాడని పరిస్థితులు వంటి విపత్కర పరిస్థితుల పట్ల సత్వర స్పందన అత్యంత కీలకం. అత్యవసర పరిస్థితులలో త్వరిత ప్రతిస్పందన, రక్షణ, సమన్వయ చర్యల పట్ల అనుబంధ వర్గాలకు ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. మాక్ డ్రిల్ ద్వారా రథ యాత్ర సమయంలో అకస్మాత్తుగా తలెత్తే అత్యవసర పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన సన్నద్ధతను సమీక్షించారు.


