జయపురం: నాటుసారా అమ్మవద్దని, తాగవద్దని హితవు చెప్పిన వార్డు మెంబర్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి ఒంటి గంటన్నర సమయంలో జయపురం సమితి ఖుడప గ్రామం పంచాయతీ వార్డు సభ్యుడు కృష్ణ హరిజన్, అతడి సోదరుడు ప్రహ్లాద హరిజన్, కుమారుడు పద్మణ హరిజన్లు ఖుడప గ్రామంలో జరిగిన మా గంగమ దేయి వార్షిక ఉత్సవం సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ నాటకాలను తిలకించి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఆ సమయంలో ఖుడప గ్రామంలోని ఓ వీధిలో నాటుసారా అమ్ముతున్న వారిని, సారా తాగుతున్న వారిని వారించారు. సారా అమ్మవద్దని, తాగవద్దని చెప్పినందుకు వారంతా ఆగ్రహించి వార్డు మెంబర్, అతడి కుంటుంబ సభ్యులపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. దాడిచేసే వారిని పట్టుకొనేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పరారీ అయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన సదర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు అయిన త్రిపాఠీ గౌడ, శ్యామ గౌడ, భగవాన్ భొత్రను కోర్టులో హాజరుపరిచారు. వారికి బైలు నిరాకరించిన కోర్టు 14 రోజులు రిమాండ్కు పంపినట్లు వెల్లడించారు.


