అమ్మ మాటే బాటగా..!
పుస్తక రూపంలో..
పెద్దబాలశిక్ష ఇవ్వాలి
ఇచ్ఛాపురం రూరల్/శ్రీకాకుళం కల్చరల్:
ఎన్నో యాసలు.. మరెన్నో పలుకుబడులు.. మాటమాటలో తియ్యదనాలు.. ఇలా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాతృభాష తెలుగు నేడు దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. మాటకై నా నోచుకోని భాషగా మిగిలిపోతోంది. దీనికి కారణాలు అనేకం. మళ్లీ మన భాష వికసించాలంటే, తెలుగు మాట పదిల పరుచుకోవాలంటే నేటితరానికి ‘తెలుగు నడక’ నేర్పాలి. అమ్మ పదానికి స్వేచ్ఛ కావాలి. ఇందుకోసం జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు నడుంబిగించారు. తమవంతుగా మాతృ భాష అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
జిల్లాలో ఎందరో రచయితలు, కవులు, కళాకారులు సిక్కోలు సాహిత్యాన్ని, మాండలికాన్ని తమ కథలు, కవితలు, గజల్స్, పాటల రూపంలో ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. అందులో తెలుగు భాషకు, తెలుగు జాతికి వెలుగు దీపికలై ప్రకాశించిన అతికొద్ది మందిలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు ప్రజలంతా కలసి ఉండాలని తపిస్తూ తన జీవిత పర్యంతమూ పోరాడిన ధీశాలి.
●‘మాకొద్తీ తెల్ల దొరతనం’ అంటూ సత్యాగ్రహాల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి ‘‘దండాలు దండాలు భారత మాత’’ అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చుసిన కవి గరిమెళ్ల సత్యనారాయణ. నరసన్నపేట దగ్గర్లోని గోనెపాడుకు చెందిన గరిమెళ్ల పరాయి పీడనకు, పాలనకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి స్పేచ్ఛ, విముక్తి కోసం కలం పట్టి, గళమెత్తిన వ్యక్తి.
●తెలుగు కథా సాహిత్యంలో కాళీపట్నం రామారావు(కారా) మాస్టారుది ఓ ఒరవడి. సరళ భాషా రచయితగా, కథకుడిగా, విమర్శకుడిగా ఆయన శైలి విభిన్నంగా ఉండేది. ఆయన రాసిన ‘యజ్ఞం’ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సిక్కోలు కథా ‘యజ్ఞాన్ని’ సాగించిన కారా మాస్టారు కథ కోసం కథా నిలయాన్నే స్థాపించారు.
●పొందూరుకు చెందిన వాండ్రంగి రామారావు(భావశ్రీ) తెలుగు సినీ రచయితగా, కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా, ఆకాశవాణి ప్రసంగికుడుగా సుపరిచితులు. ‘తెలుగుజాతి నాది’, ‘తెలుగు సంస్కృతి నాది’, ‘నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే’ అని చెప్పేవారు. వీరితో పాటు ఎం.సత్యనారాయణమూర్తి, డాక్టర్ ఎం.వి.రమణారావు, తెప్పల కృష్ణమూర్తి, వాండ్రంగి కొండలరావు, భోగెల ఉమామహేశ్వరరావు, పులఖండం శ్రీనివాసరావు, భమిడిపాటి గౌరీశంకర్, వంటి వారు ఎంతో మంది భాషాభివృద్ధికి కృషి చేశారు.
సాహిత్య సంస్థలు..
సాహితీ సంపదకు నిలయమైన శ్రీకాకుళం జిల్లాలో అనేక సంఘాలు, సాహితీ సంస్థలు కొలువుదీరాయి. తెలుగు రచయితల వేదిక(తెరవే), విశ్వసాహితీ, అభ్యుదయ రచయితల వేదిక, సుమిత్ర కళా సమితీ, రాజాం రచయితల వేదిక, అభ్యుదయ రచయితల సంఘం(అరసం), జనజాగృతి సాహితీ సంస్థ, లలిత కళా రంజనీ సంఘం, శ్రీశ్రీ కళావేదిక, ఈవేమన కవితా నిలయం. సాహితీ స్రవంతి, భారతీ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, సాహితీ కిరణాలు, కళింగసీమ సాహిత్య సంస్థ, గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం, ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదికలు తెలుగు భాష కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సమావేశాలు, సాహిత్య గోష్టిలతో తెలుగు వెలుగులు నింపుతున్నాయి. శతాధిక కవులున్న సిక్కోలులో కవిత, పద్యం, కథ, మణిపూసలు, గేయాలు, వ్యాసాలు తదితర ప్రక్రియలో తమదైన శైలిలో రచనలు చేయడంతో పాటుగా పుస్తకాలు ముద్రిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుతున్నారు.
గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపథ కళాపీటం నెలకొల్పి ఏటా జాతీయ సాహితీవేత్తలను పరిచయం చేస్తూ వారిచే కవి సమ్మేళనం, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నాం. సిక్కోలు మాండలికంతో ఉత్తరాంధ్ర జానపథ కళలు, కళింగాంధ్ర జానపథ గేయాలు పుస్తక రూపంలో తెస్తున్నాం.
–బద్రి కూర్మారావు, రచయిత, రంగోయి, పలాస
విద్యాలయాల్లో బాలబాలికలందరికీ పెద్దబాలశిక్ష పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలి. వాటిని చదివించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. గతంలో ఆర్టీసీ బస్సులపై తెలుగు భాషకు సంబంధించిన నినాదాలు కనిపించేవి. ఇప్పుడు లేవు. తిరిగి వాటిని రాయించాలి.
– వాండ్రంగి కొండలరావు, నామ విజ్ఞానవేత్త,
పొందూరు
అమ్మ మాటే బాటగా..!
అమ్మ మాటే బాటగా..!
అమ్మ మాటే బాటగా..!
అమ్మ మాటే బాటగా..!


