కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి జయరాం పంగి రాజీనామా
జయపురం: కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ ఆదివాసీ నేత, మాజీ మంత్రి జయరాం పంగి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చినట్టు జయరాం పంగి శుక్రవారం వెల్లడించారు. దండకారణ్య పర్వత ప్రాంత వికాశ పరిషత్ ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తున్నారు. దాదాపు అర్ధ శతాబ్ద రాజకీయ చరిత్ర గల జయరాం పంగి 1977లో జనతాదళ్ అభ్యర్థిగా పొట్టంగి నుంచి గెలుపొంది విధాన సభలో మొదటిసారి అడుగు పెట్టారు. తరువాత 1990లో జనతాదళ్ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన 2000, 2004లోను ఆదే పార్టీ తరఫున వరుసగా విజయం సాధించారు. 2009లో బీజేడీ అభ్యర్థిగా కొరాపుట్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీజేడీ పార్టీలో విభేదాల కారణంగా ఆ పార్టీని విడిచి 2016లో బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక 2021 జనవరిలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుని 2023లో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే ఏడాది డిసెంబర్లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు తన భవిష్యత్తు కార్యక్రమం ఏమిటో అని రాజకీయ పరిశీలకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే దండకారణ్య పర్వత ప్రాంత వికాశ పరిషత్ కు నాయకవ్వం వహించి ఒడిశాలో అవిభక్త కొరాపుట్ (కొరాపుట్, రాయగడ, మల్కనగిరి, నవరంగపూర్ జిల్లాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా, ఉమ్మడి అల్లూరీ సీతారామ రాజు జిల్లాలతో ఒక ఆదివాసీ జిల్లా ఏర్పాటుకు ఆయన ఉద్యమం చేపడతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


