చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతు
జయపురం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 1వ తేదీన జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దండాబెడ గ్రామానికి చెందిన లలిత పూజారి, అతడి భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలు బాదుడి పర్వతం సమీపంలోని శబరి నదికి చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే ఆ నలుగురు తిరిగి మరలా గ్రామానికి రాలేదు. అతడి బంధువులు అన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. వారు వెళ్లి 15 రోజులైనా జాడ తెలియకపోవడంతో బంధువులు 15వ తేదీన బొయిపరిగుడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బొయిపరిగుడ ఓడ్రాప్ టీమ్తో నదిలో గాలించారు. దీంతో ఎట్టకేలకు గురువారం సాయంత్రం నదిలో వారు రెండు మృతదేహాలను కనుగున్నారు. అవి లలిత పూజారి, అతడి చిన్న కుమార్తెలవిగా స్థానికులు గుర్తుపట్టారు. ఇంకా ఇద్దరి జాడ తెలుసుకునేందుకు ఓడ్రాప్ టీమ్ గాలిస్తోంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అనుమానస్పద మృతిగా నమోదు చేశారు.


