చిలకలపూడి(మచిలీపట్నం): రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధి, పారదర్శక పాలన, సభ్యులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించటం కేడీసీసీ బ్యాంక్ ధ్యేయమని చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో 2026–27 వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 2015కు ముందు రుణాలు పొంది వివిధ కారణాలతో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వన్టైమ్ సెటిల్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. రూ. 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకుని మరణించిన అప్పుదారుని కుటుంబాలకు వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. పీఏసీ ఎస్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం జిల్లా స్థాయి సహకార నిధికి రూ. 4.43కోట్ల మంజూరుకు సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు.
కేడీసీసీబీ ప్రొఫెషనల్ డైరెక్టర్ మురళీధర్, ఆప్కాబ్ జనరల్ మేనేజర్లు జమున, చంద్రశేఖరరెడ్డి, కేడీసీసీబీ జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, రంగబాబు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


