గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పీస్ రేట్ కార్మికులు, జేఎల్ఎంలు, స్టోర్ హమాలీలు, బిల్ కలెక్టర్స్, మీటర్ రీడర్లు, కంప్యూటర్ ఆపరేటర్లగా పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ సమస్యలపై ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోను కలిసి కమిటీ వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా యూఈఈయూ రీజనల్ అధ్యక్ష కార్యద ర్శులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరరావు మాట్లా డుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, వేతనాల్లో వ్యత్యాసాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. వేజ్ రివిజన్ కమిటీ వెంటనే వేయాలని, పెండింగ్ డీఏలను రిలీజ్ చేయాలని, ఏరియర్స్ ఒకే విడతలో చెల్లించాలని కోరారు.
జేఎల్ఎం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్ల నుంచి జేఎల్ఎంలుగా కన్వర్షన్ అయినా ఉద్యోగులకు మూడు డిస్కమ్లలో ఒకే పద్ధతిని పాటించి వెంటనే అసిస్టెంట్ లైన్మెన్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ చెల్లించాలని, పదేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి సర్వీస్ ఇన్సెంటివ్ ఇవ్వాలని, హైయిర్ పెన్షన్ సమస్యను పరిష్కరించాలని, పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఖాళీగా ఉన్న కింది స్థాయి పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూని యన్ నాయకులు పి.అనిల్ కుమార్, ఆర్.హేమంత్ కుమార్, వి.మణికంఠ కుమార్, ఎ.వెంకటేశ్వర రావు, వై.సుబ్బారావు తదితరులు ఉన్నారు.


