విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ప్రదర్శిస్తున్న సురభి నాటకోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. వినాయక నాట్యమండలి (సురభి సంస్థ) వారు ఆదివారం భక్తప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. దర్శకుడు సురభి ఆర్.వేణుగోపాల్. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి మహారుషులు వస్తారు. వారిని ద్వారంలో ఉన్న జయవిజయులు అడ్డుకుంటారు. రుషులు వారిని రాక్షసులవుతారని శపిస్తారు. హిరణ్యకశిపుడు హరి ద్వేషం, ప్రహ్లాదుని హరి భక్తి అంశాలుగా నాటకం సాగుతుంది. హిరణ్యకశిపుడిగా దినకర్, నారదునిగా పరిమళ, ఇంద్రునిగా శుభకర, ప్రహ్లాదునిగా నైమిక శాయి, లీలావతిగా శాంతిలు నటించారు. నాటకంలో ప్రధాన ఘట్టాలను వైర్ వర్క్తో అద్భుతంగా ప్రదర్శించారు.
సంప్రదాయం కాపాడుకోవాలి
ముఖ్య అతిథి ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 140 సంవత్సరాల చరిత్రకలిగిన ప్రాచీన సురభి నాటక సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సంప్రదాయ కళ ఉందన్నారు. కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నాట్యం, సాహిత్యం మన జిల్లా సొత్తు అన్నారు. సురభి కళాకారులను అభినందించారు.
పౌరాణిక నాటకాలతో కనువిందు
భక్త ప్రహ్లాద నాటకంలో ఓ సన్నివేశం
హిరణ్యకశిపుడి సంహార ఘట్టం


