వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పెనుగంచిప్రోలులో మండల పార్టీ కార్యాలయం ప్రారంభం
పెనుగంచిప్రోలు: అమరావతి రైతులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ముందుగా చెరువుకట్ట సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు, శ్రీతిరుపతమ్మవారి ఆలయం మీదుగా ప్రధాన రహదారి గుండా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న నినాదాలతో హోరెత్తించారు. ఈసందర్భంగా పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జీ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతుల భూములను లాక్కుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు రైతులు వస్తే వారి తరుఫున మద్దతుగా వైఎస్సార్ సీపీ నేతలు వెళ్తుంటే టీడీపీ గూండాలు, రౌడీలు దాడి చేయటం అత్యంత దారుణమన్నారు. అక్కడ రైతులు ఒక్కరూ కూడా లేరన్నారు. మేమంతా జగన్ సైనికులమని, మహానేత వైఎస్సార్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి గొయ్యి తీసి పాతరేసే రోజులు వచ్చాయని చెప్పారు. సగం సినిమా అయిందని, రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి హీరో అన్నారు. జగ్గయ్యపేటలో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా, వర్షం వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మరువలేనిదన్నారు.
కూటమికి భయమెందుకు ?
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని టీడీపీ వారిదేనని.. శాసనం చేస్తే ఎవరు రారన్నారు. మేము రాజధానికి వ్యతిరేకం కాదని, తక్కువ ఖర్చుతో నిర్మించాలనేది ధ్యేయమన్నారు. కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను చూసి భయపడటం ఎందుకు అన్నారు. తన్నీరు మాట్లాడుతూ.. కూటమి రెండేళ్ల పాలనంతా రెడ్బుక్ రాజ్యాంగం మీదే ఆధారపడి ఉందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్సీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కన్నమాల శామ్యూల్, బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, మండల, గ్రామ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గుడిమెట్ల శంకర్, నాయకులు పసుపులేటి సత్యశ్రీనివాసరావు, నాగబాబు, ఫిరోజ్ఖాన్, కొత్తపల్లి పెంటయ్య, దామాల శిరీస్, దేరంగుల శ్రీనివాసరావు, మెండెం రామారావు, వూట్ల నాగేశ్వరరావు, చేని రాంబాబు, చేని కుమారి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


