గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా కసరత్తు జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో శనివారం కలెక్టర్ లక్ష్మీశ విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో సర్ ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతోందన్నారు. జిల్లాలో 14,99,852 (87.53 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, 1,84,411 ఫారాల డిజిటలైజేషన్ పూర్తైందన్నారు.
నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ
తిరువూరులో 1,96,351 (94.08 శాతం), విజయవాడ పశ్చిమ 2,04,853 (79.72 శాతం), విజయవాడ సెంట్రల్ 2,30,320 (82.9 శాతం), విజయవాడ తూర్పు 2,27,376 (84.3 శాతం), మైలవరం 2,49,135 (87.36 శాతం), నందిగామ 1,94,997 (93.98 శాతం), జగ్గయ్యపేట 1,96,820 (94.83 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను ఇతర అధికారులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానం నిమిత్తం ఒక రోజు అయ్యే రూ. 6 లక్షల వ్యయం మొత్తాన్ని ఓ భక్తుడు శనివారం అందజేశారు. అమరావతి సాఫ్ట్వేర్ ఇన్పోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ అనిల్కుమార్ చింత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి అన్నదానం నిమిత్తం రూ. 6 లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మరో భక్తుడి విరాళం రూ. లక్ష
హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన చిన్మయి సాయి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.


