గంజాయి, డ్రగ్స్లో ఏపీ టాప్
అంతేనా బాధ్యత..
● బెజవాడలో గంజాయి మొక్కలు
పెంచుతుంటే ఏం చేస్తున్నారు?
● వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోనుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకటమహేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల కాలంలో రెండున్నర లక్షల గంజాయి కేసులు, 2,500కు పైగా డ్రగ్ కేసులు పెట్టినట్లుగా నివేదికలు చెబుతున్నాయని చెప్పారు. వీటిని బట్టి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా లభిస్తున్నాయో అర్థమవుతోందన్నారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గంజాయి సాగు చేయడాన్ని పోలీసులు గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఏజెన్సీలోనే కాకుండా రాజధాని ప్రాంతంలో గంజాయి సాగు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. బెజవాడలోనూ ఒక హాస్టల్ వెనుక గంజాయి మొక్కలు పెంచుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవాలన్నారు. గంజాయి సిగరెట్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు.
సైకిల్ ర్యాలీ చేసి దండయాత్ర అంటే బాధ్యత తీరిపోయిందా, డ్రగ్స్ను నియంత్రించకుండా ప్రచార ఆర్భాటమెందుకని పోతిన మహేష్ ప్రశ్నించారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి కేసులే లేవని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారన్నారు. ఆటలాడుకోవడానికి, వినోదాల కోసం సమయం వెచ్చిస్తున్నారని, ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంటే ఎవరి నియోజకవర్గం దాటి వస్తుందో హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో యువత జీవితం నిర్వీర్యమైపోతుంటే పవన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని, అది చేతల్లో చూపాలని డిమాండ్ చేశారు.


