ముగిసిన ‘డ్రగ్స్పై దండయాత్ర’
లబ్బీపేట(విజయవాడతూర్పు): రడగ్స్పై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో జిల్లాలో 35 రోజుల పాటు నిర్వహించిన సైకిల్ యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చినట్లు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఒక ఉమెన్ ఎస్ఐ, ఐదుగురు మహిళా పోలీసులతో ఎన్టీఆర్ జిల్లాలో 35 రోజుల పాటు, 510 కి.మీలు సాగిన సైకిల్ యాత్ర ఆదివారం నగరంలో ముగిసింది. ఈ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో సీపీ రాజశేఖరబాబుతో పాటు, డీసీపీ కృష్ణకాంత్పటేల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇది ఆరంభం మాత్రమే..
ఈ సందర్భంగా ఏఆర్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో సైకిల్ యాత్రలో పాల్గొన్న ఐదుగురిని సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే, ఇది ప్రజల ఆకాంక్ష నుంచి పుట్టిన యాత్ర, ఒక తల్లి కడుపుకోత నుంచి వచ్చిన యాత్ర అన్నారు. యాత్రలో భాగంగా 2,513 మంది డ్రగ్స్కు బానిసైన వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సెలింగ్ చేసిన అనంతరం అవసరమైన వారికి చికిత్స చేయించినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్లను గుర్తించి అధికారులు నిరంతరం పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, ట్రాఫిక్ డీసీపీ షిరీన్బేగం తదితరులు పాల్గొన్నారు.


