
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే, పౌర సరఫరాల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సమావేశం నిర్వహించారు. భూ సేకరణ, రీ సర్వే, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఈ–కేవైసీ, ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకుల పంపిణీ తదితర అంశాలతో పాటు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నాణ్యత నిర్ధారణకు అర్జీదారుల సంతృప్తే గీటురాయి అని, సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో సేవలందించాలని సూచించారు. రీసర్వే కార్యకలాపాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేసేందుకు చొరవ చూపాలన్నారు. జాతీయ రహదారులతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణలో వేగం పెంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీఓలు కావూరి చైతన్య, బాలకృష్ణ, మాధురి, పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, సర్వే–ల్యాండ్ రికార్డుల ఏడీ పి.త్రివిక్రమరావు, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ