
ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులంతా ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును వీసీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్యచికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు మాట్లాడుతూ సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సొసైటీకి అభినందనలు తెలిపారు. సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్గా వ్యవహరించిన నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎన్.అమ్మన్న మాట్లాడుతూ నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, నూతన ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తామని వివరించారు. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో మూత్రపిండాల చికిత్సలను అందించేందుకు, వైద్యుల నైపుణ్యతను పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 600మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్