
బోద వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడండి
●ఫ్లోరోసిడ్ ఇంజెక్షన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
●కృష్ణా జిల్లా డ్రగ్స్ అధికారులకు కొల్లూరి విజ్ఞప్తి
మచిలీపట్నంటౌన్: ఫ్లోరోసిడ్ ఇంజెక్షన్ల తయారీని నిలిపివేశారని ఈ మందు లేక బోధ వ్యాధిగ్రస్తులు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వారిని కాపాడాలని కృష్ణాజిల్లా డ్రగ్స్ అధికారులకు పెడన హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి సత్యనారాయణ (చిన్నా) విజ్ఞప్తి చేశారు. నగరంలో ఆదివారం జరిగిన కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో చిన్నా ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సోకుతున్న ఈ వ్యాధిని నియంత్రించడానికి మందును అందుబాటులోకి తేవాలన్న ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఉమ్మడి కృష్ణాజిల్లా డ్రగ్స్ ఏడీ కోట అనీల్ కుమార్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులకు లోకల్, నాన్–లోకల్ మార్పులతో ఇబ్బందులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు మొదలైన సమయంలో లోకల్, నాన్–లోకల్ నిబంధనల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనలను స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం మే 15న ఉన్నత విద్యా శాఖ ద్వారా 21, 22, 23, 36 జీఓలను జారీ చేసిందన్నారు. వీటి ప్రకారం ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కోర్సుల్లో 15 శాతం నాన్–లోకల్ కోటాను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని సీట్లను లోకల్ విద్యార్థులకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన ఏయూ రీజియన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో కూడిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లలో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు చదివిన విద్యార్థులు మాత్రమే లోకల్గా గుర్తింపు పొందుతారని వివరించారు.
రాష్ట్ర కోటా సీట్లకు అర్హత కోల్పోతున్నారు
ఎస్వీయూ రీజియన్ నుంచి విజయవాడ (ఏయూ) రీజియన్లో ఇంటర్ చదివిన వేలాది విద్యార్థులు రెండు ప్రాంతాల్లోనూ నాన్–లోకల్గా మారారని, దీంతో సుమారు ఏడు వేల ఇంజినీరింగ్, అనేక మంది నీట్ అభ్యర్థులు 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు అర్హత కోల్పోతున్నారని వివరించారు. ఎస్వీయూ రీజియన్లో కోచింగ్ సౌకర్యాలు పరిమితమైనందున విద్యార్థులు నీట్ కోసం విజయవాడకు వచ్చి చదువుకుంటున్నారని పేర్కొన్నారు. అయినా 36 జీఓతో వారు రాష్ట్ర కోటా సీట్లకు అనర్హులవుతున్నారు. దీంతో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర కోటా సీట్లు కోల్పోవడంతో విద్యార్థులు ఖరీదైన ప్రైవేట్ కళాశాలలపై ఆధారపడవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి జీఓలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.