
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్యాకేజీలకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. కలెక్టరేట్లో టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో కలెక్టర్ లక్ష్మీశ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు, మూడు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీల వివరాలతో రూపొందించిన కరపత్రాలను పరిశీలించారు.
ప్యాకేజీల కింద సందర్శనకు వీలయ్యే ప్రాంతాలు, ప్యాకేజీల ధరలు, పర్యాటకులకు కల్పించే వివిధ సౌకర్యాలు తదితర వివరాలతో రూపొందించిన కరపత్రాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హోటళ్లు, ట్రావెల్ తదితర విభాగాల అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి రూపొందించిన పర్యాటక ప్యాకేజీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేందుకు వీలుగా గైడ్లను గుర్తించాలన్నారు. త్వరితగతిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీటీడీసీ–సీఆర్ఓ సుహాసిని పాల్గొన్నారు.