
బండెనక బండి కట్టి..
కంచికచర్ల: బడే హజరత్ ఉరుసును ప్రతి ఏడాది ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మండలంలోని పెండ్యాలతో పాటు ఇతర గ్రామాల నుంచి చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో కొలువై ఉన్న బడే హజరత్ దర్గా ఉరుసుకు తరలివెళ్తుంటారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ముస్లింలు బండెనెక బండికట్టి వరసగా ఉత్సవాలకు తరలివెళ్తారు.
400 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ..
ఉరుసు ఉత్సవాలను మతాలకతీతంగా జరుపుకుంటారు. ముస్లింలు ఉరుసుకు వెళ్లేందుకు హిందువులు ఎద్దుల బండ్లను ఉచితంగా కట్టి వారితో పాటు ఉత్సవాల్లో పాల్గొంటారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు, కృష్ణాజిల్లాలోని చల్లపల్లి, అవనిగడ్డ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, వైరా, మధిర, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లింలకు ఉచితంగా ఎడ్ల బండ్లను కడతారు. ఉరుసు ఉత్సవాల్లో వారు కూడా వచ్చి పాల్గొంటారు. 400 ఏళ్ల నుంచి ముస్లింలు ఈ ఉత్సవాల్లో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లిం సంతతికి చెందిన వారంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలు చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో కొలువై ఉన్న బడేమియా తాతయ్య షాషమియాను ప్రార్థించి అక్కడ నుంచి సాయంత్రానికి తుర్లపాడు చెరువులో ఉన్న బడేమియా హజరత్ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి..
తుర్లపాడులో కొలువై ఉన్న బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు ఈ నెల 23, 24 తేదీలలో జరుగనుంది. గ్రామంలో మొత్తం జనాభా 14 వేల మంది ఉన్నారు. వారిలో 12 వేలకు పైగా ముస్లింలు ఉన్నారు. ఊరంతా రెండు రోజుల పాటు తుర్లపాడు వెళ్లేందుకు ఇళ్లకు తాళాలు వేస్తారు. వృద్ధులు నడవలేనివారు ఇళ్లకు కాపలా ఉంటారు. ఉరుసు ఉత్సవాలకు తరలి వెళ్తున్న ఎద్దుల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరాన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు.
రేపటి నుంచి తుర్లపాడు ఉరుసు బడే హజరత్ ఉరుసుకు తరలివెళ్లనున్న ముస్లింలు హిందువులు, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే తుర్లపాడు పండుగ
కులమతాలకతీతంగా ఉరుసు
తుర్లపాడు ఉరుసు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా జరుపుకుంటాం. హిందువులు ఎడ్ల బండ్లను ఉచితంగా కడతారు. హిందువులు భక్తి పారవశ్యంతో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరుపుకునే ఉరుసు ఉత్సవాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
– షేక్ మలక్బషీర్, ఎంపీపీ, పెండ్యాల

బండెనక బండి కట్టి..