
కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు
గిరిజనుల గోడు
పట్టించుకోండి
రక్షిత మంచినీరు లేక, ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్న నీరు తాగి కిడ్నీ వ్యాధిబారిన పడిన పడిన ఎ.కొండూరు మండలంలోని గిరిజనుల బాధలను అధికారులు గుర్తించాలి. అవసరమైన వైద్యసేవలు అందించాలి. తండాలకు శుద్ధి చేసిన జలాలు అందించడానికి చర్యలు తీసుకోవాలి.
– మేకల డేవిడ్, ఎ.కొండూరు
రక్షిత మంచినీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో రక్షిత నీటి సరఫరా పనులు చేపట్టారు. ఈ పనులను ఇంతవరకు కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదు. కిడ్నీ రోగుల విషయంలో ప్రభుత్వం కాలక్షేపం చేయడం తగదు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, తిరువూరు
పురోగతిలో పనులు
కిడ్నీ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 కోట్ల వ్యయంతో ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే ప్రాజెక్టు పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. పనులు పురోగతిలో ఉన్నాయి.
– రాఘవేంద్ర,
ఆర్డబ్ల్యూఎస్ డీఈ, తిరువూరు
● ‘తిరువూరు’లో రక్షిత నీటి
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
● కిడ్నీరోగుల గోడు పట్టదా!
● జూన్ ఆఖరుకు పనుల
పూర్తికి కలెక్టర్ ఆదేశం
● ఎ.కొండూరులో అరకొరగా
ట్యాంకర్లతో నీటి సరఫరా
తిరువూరు: తండాల్లో ప్రజలకు శుద్ధ జలం అందక ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరా చేయడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతం తిరువూరు రెవెన్యూ డివిజన్. ఇక్కడ తండాల్లో కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరాకు కావాల్సిన పనులను కూటమి ప్రభుత్వం నత్తనడకన చేస్తోంది. ఎ.కొండూరు మండలంలో 15 తండాల్లో 244 కిడ్నీ కేసులున్నట్లు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్నారు. మూడు రోజుల క్రితం గంపలగూడెం మండలం గోసవీడులో 14 ఏళ్ల బాలిక మరణిండంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గంపలగూడెంలోని నారికింపాడు, అనుముల్లంక, కనుమూరు, కొత్తపల్లి, వినగడప తండాలలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల స్వాంతనకు చర్యలు లేవు.
పనులు పూర్తయ్యేదెప్పుడో!
గత ఏడాదిగా వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూయస్ శాఖల జిల్లా అధికారులు సమీక్షలు, పరిశీలనలు చేస్తున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులకు బోరు నీరే దిక్కైంది. గత ఫిబ్రవరిలో కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో కృష్ణా జలాల సరఫరాకు చేపట్టిన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. అప్పుడు.. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీరందించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు.
చాలీచాలని నీటితో అవస్థలు
రెడ్డిగూడెం మండలం కుదప వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి ట్యాంకర్లతో ఎ.కొండూరు మండలంలోని గ్రామాలకు కృష్ణా జలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా వారి అవసరాలకు చాలక ఇబ్బంది పడుతున్నారు. గతంలో కృష్ణా జలాల సరఫరా కోసం నిర్మించిన సంప్లు నిరుపయోగంగా మిగిలాయి. ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం గుర్తించింది. ప్రత్యేకంగా కృష్ణా జలాలను శుద్ధి చేసి ఎ.కొండూరుకు అందించే ప్రాజెక్ట్కు సుమారు రూ.49.94 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మైలవరంలోని సీపీడబ్ల్యూసీ స్కీం వరకు వస్తున్న కృష్ణా జలాలను కుదపలోని సంప్ వద్దకు తీసుకెళ్లి ట్యాంకర్ల ద్వారా తండాలకు పంపుతున్నారు.
రక్షిత నీరు లేక పెరుగుతున్న రోగులు
ఫ్లోరైడ్, సిలికాన్ శాతం అధికంగా ఉన్న ‘ఎ.కొండూరు’లోని పలు గ్రామాల్లో బోర్ నీటిని తాగుతున్న గిరిజనుల కిడ్నీలు పాడై ఆస్పత్రుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎ.కొండూరు, తిరువూరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎ.కొండూరు మండలంలోని మత్రియా తండా, కేశ్యాతండా, దీప్లా నగర్, మాన్సింగ్తండా, కొండూరు తండా, గొల్లమందల తండా, పెద తండా, వెంకట తండా, కుమ్మరికుంట్ల తండా, గోపాలపురం గ్రామాల్లో కిడ్నీరోగుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మండలంలో 413 మంది కిడ్నీ రోగులను ప్రభుత్వం గుర్తించగా, 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.
శాశ్వత ప్రాజెక్టు ఏర్పాటు నత్తనడక
మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా జలాల సరఫరాకు నిర్దేశించిన శాశ్వత ప్రాజెక్టులో భాగంగా కుదప సంప్ వద్ద కొండపైన ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణంలో ఉంది. పైపులైన్ల పనులు 200 కిలోమీటర్లు చేపట్టాల్సి ఉండగా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రోగులు కోరుతున్నారు. కిడ్నీ బాధితులకు రక్షిత మంచినీరందించడంతో పాటు డయాలసిస్ రోగులకు అవసరమైన వైద్యసేవలు చేయాలని, పెన్షను మంజూరు, పౌష్టికాహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ఎ.కొండూరు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. కోడూరు, మారేపల్లి, పోలిశెట్టిపాడు గ్రామాలకు ఇంతవరకు రక్షిత మంచినీరందించలేదు. ఆ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నా ముందు జాగ్రత్తగా కృష్ణా జలాల సరఫరాకు చర్యలు తీసుకోవట్లేదు. శుద్ధిచేసిన జలాల సరఫరాకు పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసినా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తవలేదు.

కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు

కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు

కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు

కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు