
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో అంతరాలయ, వీఐపీ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. దీంతో భక్తులకు త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం లభించింది.
పెద్ద ఎత్తున పాల్గొన్న ఉభయ దాతలు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవలకు ఆదివారం డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, నవగ్రహ హోమాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద , 7వ అంతస్తులో మైక్ ప్రచార కేంద్రం వద్ద దేవస్థానం మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాతల సహకారంతో ప్రతి రోజు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.
కిటకిటలాడిన క్యూ లైన్లు
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. కౌంటర్లలో టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. రూ.300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా క్యూలైన్లను నియంత్రించారు. రూ.300 టికెట్లపై కేటాయించి క్యూలైన్తో పాటు అదనంగా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.100 టికెట్ భక్తులకు వారికి కేటాయించిన క్యూతో పాటు అదనంగా మరో క్యూలైన్ కేటాయించడంతో దర్శనం త్వరగా పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఆన్లైన్లో ముందుగానే రూ.500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు.
సూర్యోపాసన సేవ
లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు భక్తులు, ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
21న కానుకల లెక్కింపు
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7–30 గంటల నుంచి కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
దుర్గ గుడి కౌంటర్లలో సీసీ కెమెరాలు
అదనపు వసూళ్లకు చెక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్ఫోన్ భద్రపరుచుకునే కౌంటర్లు, లగేజీ కౌంటర్లలో అదనపు వసూళ్లు, ఉచితంగా ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్లో డబ్బుల వసూళ్లపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఆలయ అధికారులు చెక్ పెట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహా మండపం దిగువన, ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద చెప్పులు, లగేజీ, సెల్ఫోన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. చెప్పుల స్టాండ్ను దేవస్థానం ఉచితంగా నిర్వహిస్తుండగా, లగేజీ, సెల్ఫోన్లు కౌంటర్లను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే రద్దీ సమయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌంటర్లోని సిబ్బంది అదనపు వసూళ్లకు చెక్ పెడుతూ ఆయా కౌంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్లో సిబ్బంది నిరంతరం ఈ కెమెరాలను పర్యవేక్షిస్తూ, కౌంటర్ల వద్ద ఎటువంటి వివాదాలు జరిగినా వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ఆర్జిత సేవలకు డిమాండ్
అంతరాలయ దర్శనం రద్దు

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ