
‘అద్దె గర్భం’ అనుమతులపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్టీ), అద్దె గర్భం(సరోగసి) చట్టం–2021 అమలులో భాగంగా జిల్లా మెడికల్ బోర్డు శనివారం సమావేశమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె గర్భం సేవలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు దంపతుల అప్లికేషన్లను పరిశీలించారు. వారు అర్హత కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్హెచ్ఎం కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నవీన్, జీజీహెచ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి. అనిల్కుమార్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన డీఎంహెచ్ఓ..
ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా– స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తమ సిబ్బందితో కలిసి కార్యాలయం పరిధిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డెప్యూటీ డెమో ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, కార్తీక్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ
సురక్షిత తాగునీరు
నందిగామరూరల్: ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర జల్ జీవన్ మిషన్ వెరిఫికేషన్ బృంద సభ్యుడు హరిపాల్సింగ్ అన్నారు. మండలంలోని పెద్దవరం, పాతబెల్లంకొండవారిపాలెం, లింగాలపాడు, అడవిరావులపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లోని జల్ జీవన్, ప్రజల తాగునీటికి సంబంధించిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. లింగాలపాడు, అడవిరావులపాడు గ్రామాలలో కొందరు జల్ జీవన్ మిషన్ పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపించగా.. స్పందించిన బృంద సభ్యుడు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విద్యాసాగర్, ఏఈ రవికుమార్, తేజ, సర్పంచ్లు సూరా వెంకట నర్సమ్మ, బొల్లినేని పద్మజ పాల్గొన్నారు.
నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం
కూచిపూడి(మొవ్వ): యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా నమోదు చేశారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో ప్రముఖ కూచిపూడి నాట్య క్షేత్రం కూచిపూడిలో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, నాట్య విద్యార్థులు కలిసి నటరాజ స్వామికి శనివారం పూలమాలవేసి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకొన్నారు.
జాతీయ ఖోఖో పోటీలకు గుడివాడ విద్యార్థులు
గుడివాడ టౌన్: ఖేలో ఇండియా జూనియర్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు గుడివాడ ఎస్పీఎస్ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశాలకు చెందిన డి.రాకేష్, టి.తిమోతి, సాజిత్ఖాన్, బి.జయ సూర్యతేజ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. మే నాలుగు నుంచి 11వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తమ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.

‘అద్దె గర్భం’ అనుమతులపై సమీక్ష