సౌదీలో ఎన్నారై ఆత్మహత్య.. సాయం చేయాలంటూ కేటీఆర్‌కు వినతి | Sakshi
Sakshi News home page

సౌదీలో ఎన్నారై ఆత్మహత్య.. సాయం చేయాలంటూ కేటీఆర్‌కు వినతి

Published Mon, Jan 3 2022 1:24 PM

A Poor Woman From Jagityal Asked KTR To Help For Her Husband deceased body Handovering - Sakshi

చుట్టు ముట్టిన సమస్యలతో సతమతం అవుతూ ధైర్యం కోల్పోయి సౌదీ అరేబియాలో  తనువు చాలించాడో ఎన్నారై. అతనిపైనే ఆధారపడిన కుటుంబం ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. కనీసం తన భర్తను చివరిసారి చూసుకునేందుకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించింది ఆ మృతుడి భార్య. 

జగిత్యాల జిల్లా కతలాపూర్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన పిల్లి నర్సింహలు బతుకుదెరువు కోసం అప్పు చేసి సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఆల్‌ హసా ఏరియాలో పని చేస్తున్నాడు. ఇతని సంపాదనపైనే ఆధారపడి అతని భార్యా పిల్లలు జీవిస్తున్నారు. పరిస్థితులు అంతా చక్కబడతాయని అనుకునేలోగా ఘోరం జరిగిపోయింది. 

పిల్లి నర్సింహులు 2021 డిసెంబరు 29న సౌదీలో తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. దీంతో అతని శవాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. తన భర్త మృతదేహాన్ని తన మరిది పిల్లి నరేశ్‌తో ఇండియాకు పంపించాల్సిందిగా కోరుతూ మృతుడు నర్సింహులు భార్య పిల్లి వసంత ఇప్పటికే సౌదీలో ఉన్న ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులకు ఆథరైజేషన్‌ లెటర్‌ని 2022 జనవరి 1న ఇచ్చింది.  

కాన్సులేట్‌ అధికారుల నుంచి స్పందన రావడం ఆలస్యం కావడంతో ట్విట్ట‍్టర్‌ ద్వారా సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జెడ్డాలో ఉ‍న్న భారత ఎంబసీ అధికారులతో మాట్లాడతారని హమీ ఇచ్చారు. నర్సింహులుని కడసారి చూసుకునేందుకు భార్య పిల్లలు ఇక్కడ దీనంగా ఎదురుచూస్తున్నారు .

చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల మృతి

Advertisement
Advertisement