
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావనతో పదేళ్ల క్రితం ప్రారంమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశ వర్ష వార్షికోత్సవము ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో శ్రీ మహా త్రిపురసుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన కార్యక్రమంలో స్వామి వారిని అర్చనకార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్తీక మాసం మొదటి రోజున చేపట్టిన ఈ కార్యక్రమము లిటిల్ ఇండియాలో, ఆర్య సమాజ్ వారి ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకము గా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకము గా మూల మంత్రము తో ఆవరణ అర్చన చేసి ఆ తరువాత అరుణపారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకము గా చేసిన అనంతరం సూక్తముల పారాయణా సహితము గా వేదోక్త శాంతులయిన దశశాంతులు తో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం కావించుకుని, చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన చేసి, అటుపిమ్మట శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
చివరగా షోడశ ఉపచారా పూజ, దర్భార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమమును ఘనంగా ముగించారు.
ఈ కార్యక్రమమును సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేష్ మరియు రాజేష్ శ్రీధర ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని సింగపూర్లో తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశి కృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే అడగగానే హాల్ ని సమకూర్చిన ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలా తెలిపారు. కార్యక్రమములో పాల్గొన్న రిత్విక్ లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేసారు.

ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు.