ఆధునిక సాంకేతికతతో జీవరసాయన శాస్త్రంలో మార్పులు
తెయూ(డిచ్పల్లి): ఆధునిక సాంకేతికతతో జీవరసాయన శాస్త్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ(ఆర్ఎస్సీ) (లండన్) డెక్కన్ ఛాప్టర్ హాననరీ సెక్రెటరీ ప్రొఫెసర్ వీ పీసపాటి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విజ్ఞాన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ అండ్ బయోకెమికల్ క్యారెక్టరైజషన్’ అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థులకు కాంపౌండ్ను ఎలా గుర్తించాలి, వేరు చేయాలనే అంశాలపై పీసపాటి అవగాహన కల్పించారు. సీఎస్ఐఆర్–సీఐఎంఏపీ హైదరాబాద్ సీనియర్ ప్రిన్సిపాల్, సైంటిస్టు డాక్టర్ ఉప్మాల కోటేశ్ కుమార్, నిపర్, హైదరాబాద్ ప్రొఫెసర్ ఎన్ శంకరయ్య ఆధునిక స్పెక్ట్రోస్కోపీ, క్రోమాటోగ్రఫీ, బయోకెమికల్ విశ్లేషణ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీ రాంబాబు, కన్వీనర్ వాసం చంద్రశేఖర్, ఎం ప్రసన్న శీల, అధ్యాపకులు బోయపాటి శిరీష, కిరణ్మయి, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


