పోలీసుల వలయంలో బాన్సువాడ
● బాన్సువాడలో 10చోట్ల పికెటింగ్
● పట్టణంలోనే మకాం వేసిన కామారెడ్డి ఎస్పీ
బాన్సువాడ: బాన్సువాడ పట్టణం పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లింది. అడుగడుగున పోలీసులు నిఘా పెట్టారు. పట్టణంలోని పది చోట్ల పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన అల్లర్లతో పోలీసులు ఒక్క సారిగా అలర్టు అయ్యారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్ల దాడుల వరకు వెళ్లింది. దీంతో కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలో పట్టణంలో పోలీసులు బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన 42 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. శనివారం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. స్వయంగా ఎస్పీ బాన్సువాడలోనే మాకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బాన్సువాడలో రాళ్ల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరమార్శించేందుకు వస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణను అంకోల్ క్యాంపు వద్ద, మాజీ ఎంపీ బీబీ పాటిల్ను బుడ్మి చౌరస్తా వద్ద, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పెద్ద శంకరంపేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం బాన్సువాడలో ప్రశాంత వాతవారణం నెలకొంది. బాన్సువాడకు వచ్చిపోయే వారిని సైతం పోలీసులు ఆపి వివరాలు సేకరించి పంపిస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి అల్లర్లు పునరావృత్తం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడకు వస్తుండగా తనను పోలీసులు అడ్డుకోవడం శోచనీయమని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన నాటి నుంచి హిందువులపై దాడులు పెరిగాయని ఆయన అన్నారు.
పోలీసుల వలయంలో బాన్సువాడ


