భరతమాత సేవకు అంకితమవుదాం
● రాష్ట్ర బౌద్ధిక్ ప్రముఖ్ అహల్య
నిజామాబాద్ రూరల్: దేశ ప్రజలైన ప్రతి ఒక్కరం భరతమాత సేవకు అంకితం కావాలని రాష్ట్ర బౌద్ధిక్ ప్రముఖ్ అహల్య అన్నారు. ఆదివారం నగరంలోని శివాజీనగర్లో ఉన్న శ్రీవైశ్య ఉన్నత పాఠశాల(మాణిక్భవన్)లో రాష్ట్ర సేవికా సమితి ఇందూర్ జిల్లా సార్వజనికోత్సవ ఆహ్వానం, పథసంచాలన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ అన్నాగౌడ్ లత హాజరై మాట్లాడారు. జిల్లాలో గత 30 ఏళ్లుగా సేవికా సమితి కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. 2021 నుంచి సేవికా సమితి సభ్యులు ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రేమ గల పిల్లలు తల్లికి సేవ చేసినట్లు రాష్ట్ర సేవికా సమితి సేవకులు భారత మాతను సేవిస్తున్నారని అన్నారు. హిందువులు ఏకమై స్వాభిమానంతో ఆలోచిస్తున్నారని అన్నారు.
మన పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పాలని అన్నారు. ప్రతి వ్యక్తి దేశ చరిత్ర చదివితే సమాజాన్ని బలంగా నిర్మిస్తారన్నారు. శివాజీ తల్లి జిజియా బాయి, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలను ఆదర్శంగా తీసుకుని భరతమాతకు సేవలందిచాలని కోరారు. భారత సేవిక సమితి ఏర్పడి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇందూరు పుర వీధుల్లో పథ సంచలన్ నిర్వహించారు. నగరంలోని శివాజీనగర్, ఆర్ఆర్ చౌరస్తా, సరస్వతి శివుమందిర్, మార్కండేయ మందిరం, గర్ల్స్ హైస్కూల్, పెద్ద బజార్ చౌరస్తా, కృష్ణ మందిర్ నుంచి శివాజీనగర్కు చేరుకుంది. కార్యక్రమంలో వక్తలు పొద్దుటూరి రూప, భారత సేవిక సమితి సభ్యులు పాల్గొన్నారు.


