Center Provides Y Category Security for MP Dharmapuri Arvind - Sakshi
Sakshi News home page

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత.. 8 మంది కమాండోలు

Jul 11 2023 9:40 AM | Updated on Jul 12 2023 8:52 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. దీంతో ఇక నుంచి అర్వింద్‌ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు. మొత్తం 8 మంది కమాండోలు ఎంపీకి నిరంతరం రక్షణగా ఉండనున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇటీవల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ కేటగిరి భద్రత కల్పించింది. తర్వాత కేంద్రం తాజాగా ఎంపీ అర్వింద్‌కు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎంపీ పర్యటన వివరాలన్నీ కేంద్రానికి, రాష్ట్ర డీజీపీకి..
ఎంపీ అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత నేపథ్యంలో ఆయన దేశంలో ఎక్కడ పర్యటించి నా అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర హోంశాఖ కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాష్ట్ర డీ జీపీకి పర్యటన వివరాలు అందుతాయి. దీంతో ఎంపీ పర్యటన సందర్భంగా భద్రత కల్పించే వ్యవహారాలను డీజీపీ నేరుగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంపీ పర్యటన నేపథ్యంలో చిన్న ఘటన చోటుచేసుకున్నా సంబంధిత జిల్లా, క్షేత్రస్థాయి అధికారులపై డీజీపీ చర్య లు తీసుకోవాల్సి ఉంటుంది.

వై కేటగిరి భద్రత
ఎంపీ అర్వింద్‌ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సందర్భంగా వరుసగా మూడు సార్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యా రు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళనలు చేస్తే, ప్రతిగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పసు పు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంటూ వచ్చాయి.

గతేడాది ఎంపీ అర్వింద్‌ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభోత్సవా లు చేసేందుకు, మరికొన్ని చోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్‌ మండ లం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్‌ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ లకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

ఆర్మూర్‌ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఎంపీ కారు అద్దాలు సైతం బీఆర్‌ఎస్‌ శ్రేణు లు పగులగొట్టాయి. ఈ విషయంలో పోలీసులు టీఆర్‌ఎస్‌కు సహకరించి తన భద్రతను గాలికొదిలేశారని అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌పై పార్ల మెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.

అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యమయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ వీఆర్‌ఎస్‌ తీసుకున్న బ్లాక్‌క్యాట్‌ కమెండో, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లతో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రత కోసం నియమించుకున్నారు. అలాగే ఒక కిలోమీటర్‌ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వాళ్లు దాడులకు దిగితే తూటాలు దిగడం ఖాయమని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement