దాతల దయతో గట్టెక్కిన సీఎం కప్ పోటీలు!
● గ్రామ, మండల స్థాయిలో నిర్వహణకు నిధులు ఇవ్వని ప్రభుత్వం
● ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతోనే ముగించిన నిర్వాహకులు
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో దాతల దయపైనే ఆధారపడాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండ్రోజుల క్రితం నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించగా త్వరలోనే జిల్లా స్థా యి పోటీలు జరగనున్నాయి. పోటీలపై విస్తృత ప్రచారం నిర్వహించినా నిధుల కేటాయింపులో ప్ర భుత్వం విఫలం కావడంతో నిర్వాహకులు దాతల సహకారం కోరారు. స్పందన లేని ప్రాంతంలో కేవలం ఎంపికలతోనే క్రీడా పోటీలను మమ అనిపించారు. అయితే, మండల స్థాయిలో పోటీలను నిర్వహించడానికి కేవలం రూ.2 వేల చొప్పున నిధులను కేటాయించడం గమనార్హం. పోటీల నిర్వహణకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. గ్రామ స్థాయిలోనైతే కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు ఉత్సాహంగానే క్రీడాపోటీల నిర్వహణకు ముందుకొచ్చారు. వారు సొంతంగా నిధులు ఇవ్వకపోయినా స్థానిక పంచాయతీలపై ఆర్థిక భారం పడింది. బహుమతుల ఖర్చులను మాత్రమే కొందరు సర్పంచ్లు సొంతంగా భరించారు. మరికొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చి బహుమతులను కొనుగోలు చేసి ఇచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించే సీఎం కప్ పోటీల వరకై నా నిధుల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


