సారంగపూర్: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆదివారం అటవీ ప్రాంతంలో లేగదూడ కళేబరం కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండురోజుల క్రితం సిర్పెల్లి గ్రామ శివారులోని అడవిలోకి మేతకు వెళ్లిన ఆవులమందలోంచి ఒక లేగదూడ కనిపించకపోవడంతో స్థానికులు గాలింపు మొదలు పెట్టారు. రెండురోజుల తర్వాత కళేబరం కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్ఓ రామక్రిష్ణారావు, డీఆర్వో నజీర్ఖాన్ లేగదూడ కళేబరం లభ్యమైన ప్రాంతంలో సీసీకెమెరాలను అమర్చి చిరుతపులి హతమార్చినట్లు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు హర్షవర్ధన్, సంధ్యారెడ్డి, సంతోష్, సుజాత, వెన్నెల, తదితరులు ఉన్నారు.
గేదెలు తరలిస్తున్న ఆరుగురిపై కేసు
దహెగాం: అక్రమంగా గేదెలు తరలిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని కల్వాడ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వాహనంలో 11 గేదెలు, బొలెరో వాహనంలో ఏడు గేదెలు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా చింతలమానెపల్లి నుండి జగిత్యాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, గేదెలు స్వాధీనం చేసుకుని నిందితులు ఎండీ అహ్మద్, షేక్ ఫిరోజ్, అబ్దుల్ సమీర్, షాహీద్ అలీ, ఎండీ అబ్బుషేక్, సర్వర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రైలు ఢీకొని ఒకరు మృతి
బెల్లంపల్లి: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ కె.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కన్నాలబస్తీకి చెందిన కన్నెపల్లి నాగేశ్వరరావు (55) కన్నాల గేటు వద్ద రైలు పట్టాలను దాటే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. ఘటనపై మంచిర్యాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
నగల దుకాణంలో అగ్ని ప్రమాదం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్–పింజారిగుట్ట రోడ్డులో ఉన్న నగల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం మూసి ఉండటం, లోపల లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. రాత్రి 10:30 గంటల సమయంలో దుకాణం నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి, దుకాణం యజమానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


