ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్కు లేఖ
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల పనితీరులో తక్షణం జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. పోల్ డేటా ఎంట్రీ కోసం కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బంగ్లా సహాయత కేంద్ర సిబ్బందిని నియమించవద్దంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ప్రైవేట్ గృహ సముదాయాల్లో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. ఈ చర్యలన్నీ ఒక రాజకీయ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం, ఆ పార్టీ ఆదేశం మేరకు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికే జిల్లా కార్యాలయాల్లోని సమర్థులైన నిపుణులు ఈ విధులు నిర్వహిస్తుండగా ఇతర సంస్థలకు ఔట్సోర్సింగ్ం ఇవ్వడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాల్లోని ఫీల్డ్ ఆఫీసులు తమ అవసరానికి అనుగుణంగా సొంతంగా కాంట్రాక్టు డేటా ఎంట్రీ సిబ్బందిని నియమించుకుంటాయని, ఆ నియామకాలను చేపట్టే అధికారం జిల్లా ఎన్నికల అధికారులకుందని ఆమె తెలిపారు.
కొత్త ఆదేశాలు మాత్రం చట్టబద్ధమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అంతేకాదు. ప్రైవట్ నివాస సముదాయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చనే విధానంపైనా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాలెప్పుడూ ప్రభుత్వ లేదా పాక్షిక ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లోనే ఏర్పాటు చేస్తారని, ఈ కొత్త ప్రతిపాదన సమస్యాత్మకంగా ఉందన్నారు. ప్రైవేట్ నివాస సముదాయాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అవి నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉందని, ఎన్నికల ప్రక్రియ న్యాయబద్దతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ గౌరవానికి భంగం వాటిల్లకుండా ఈ అంశాలను అంత్యంత నిస్పక్షపాతంగా, పారదర్శకంగా పరిశీలించాలని ఆమె కోరారు.


