Viral: విచ్చలవిడిగా జలకాలాటలు.. ఒక్కరికీ మాస్క్‌లేదు!

Viral Video: Hundreds Of Maskless Tourists Throng Kempty Falls in Mussoorie - Sakshi

కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అనేక పర్యాటక ప్రదేశాలు సుదీర్ఘ కాలంగా మూసివేసిన విషయం తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాలైన ముస్సోరి, నైనిటాల్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. స్థానిక హోటళ్లన్నీ నిండిపోయాయి. వీధుల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంది.

అయితే కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాల వద్ద కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ముస్సోరిలోని కెంప్టీ వాటర్‌ఫాల్స్‌ వద్ద వందలాది మంది పర్యాటకులు గుంపులు గుంపులుగా మాస్క్‌ లేకుండా స్నానం చేస్తున్న వీడియో బుధవారం నెట్టింట్లో వైరలవుతోంది. వీడియోలో ఒక్కరూ కూడా మాస్క్‌ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీడియోపైన నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎమ్టీ బ్రెన్‌ ఇన్‌ కెంప్టీ’(కెంప్టీలో మెదడు లేని వాళ్లు) అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆ గుంపులను చూస్తుంటే భయమేస్తుందంటున్నారు.

కాగా ముస్సొరీలో, కుల్ది బజార్, మాల్ రోడ్ వంటి ప్రదేశాలు తరచుగా రద్దీగా మారుతున్నాయి.. పర్యాటకుల సంఖ్య పెరగడంతో నైనిటాల్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి తలెత్తింది. ఉత్తరాఖండ్‌తో పాటు, కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత ఐదు లక్షలకు పైగా పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్‌కు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నగరాలు, హిల్ స్టేషన్లలోనే కాకుండా దేశంలో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా  కనిపిస్తున్నారు. కోవిడ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ నిబంధనలను పాటించాలని కేంద్రం పదేపదే చెబుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top