పోరాటాల దొరెస్వామి అస్తమయం  | Veteran Freedom Fighter, Centenarian H S Doraiswamy Passes Away | Sakshi
Sakshi News home page

పోరాటాల దొరెస్వామి అస్తమయం 

May 27 2021 1:21 AM | Updated on May 27 2021 4:02 AM

Veteran Freedom Fighter, Centenarian H S Doraiswamy Passes Away - Sakshi

యశవంతపుర: కన్నడనాట ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు హెచ్‌ఎస్‌ దొరెస్వామి (103) బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. వయోభారం, గుండె సమస్యలతో ఆయన జయదేవ ఆస్పత్రిలో ఇటీవల చేరారు. కరోనా సోకడంతో మే 8న జయదేవ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకోవడంతో నయమై 13న ఇంటికి చేరుకున్నారు. 17న గుండె సమస్య రావడంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఆయన అంతిమసంస్కారాలను కోవిడ్‌ నియామాలను పాటిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘నాకు వయసైపోయింది. నాకు ఆస్పత్రిలో బెడ్‌ అక్కర్లేదు. యువతకు బెడ్‌ కేటాయించండి’అని పదేపదే చెప్పేవారని ఆస్పత్రి వైద్యులు గుర్తుచేసుకున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా పోరాటాలను పక్కనపెట్టి ఇంటికే పరిమితమయ్యారు.  


టీచర్‌ నుంచి క్విట్‌ ఇండియా బరిలోకి  
హరోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి 1918 ఏప్రిల్‌ 10న బెంగళూరు సమీపంలోని హరోహళ్లిలో జని్మంచారు. బెంగళూరు సెంట్రల్‌ కాలేజీలో బీఎస్సీ పూర్తిచేశారు. తరువాత ఓ హైసూ్కల్లో సైన్స్, గణిత ఉపాధ్యాయునిగా మారిన ఆయన 1942లో గాం«దీజీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్‌వారిని హడలగొట్టేందుకు చిన్నసైజు టైమ్‌బాంబులను ప్రభుత్వ ఆఫీసుల్లోని రికార్డు రూమ్‌లు, పోస్ట్‌బాక్స్‌లలో ఉంచేవారు. 1943లో బాంబులతో పోలీసులకు పట్టుబడడంతో జైలు పాలయ్యారు. 14 నెలల కారాగారవాసం తరువాత విడుదలయ్యాక స్వాతంత్య్ర పోరాటం కొనసాగిస్తూ పలు పత్రికలను స్థాపించి స్వరాజ్య స్ఫూర్తిని రగిల్చారు.  

స్వాతంత్య్రం తరువాత సైతం  
స్వాతంత్య్రం సిద్ధించాక దేశంలోని అసమానతలపై దొరెస్వామి దృష్టి సారించారు. 1950లలో భూదాన్‌ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఎమర్జెన్సీని విధించబోతున్నట్లు ముందుగానే గ్రహించిన దొరెస్వామి అప్పటి ప్రధాని ఇందిరాగాం«దీని నియంతతో పోలుస్తూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతానని గళమెత్తారు. జయప్రకాష్‌ నారాయణ్‌ సోషలిస్టు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. కర్ణాటక, బెంగళూరుకు సంబంధించిన అనేక ప్రజా సమస్యల పోరాటాల్లో ముందున్నారు. బెంగళూరులో అన్నాహజారే చేపట్టిన అవినీ తి వ్యతిరేక ఉద్యమంలోను సంఘీభావం తెలిపారు. ఎక్కడ ప్రజాందోళనలు జరిగినా అక్కడ దొరె స్వామి ఉంటారని పేరుగాంచారు. ఆయనకు భార్య లలితమ్మ, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. లలితమ్మ రెండేళ్ల కిందట కన్నుమూశారు. దొరె స్వామి కర్ణాటక అంతరాత్మ అంటూ ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్ర యడియూరప్ప సహా ప్రముఖులు సంతాపం తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement