
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో గల తాజ్ మహల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఎక్స్తో తాజ్మహల్ను పేల్చివేస్తామని కేరళ నుంచి ఈ మెయిల్ అందిన దరిమిలా సంబంధిత అధికారులు తాజ్ మహల్(Taj Mahal) వద్ద హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా సంస్థలు అప్రమత్తమై, నిఘాను మరింత ముమ్మరం చేశాయి.
బాంబు బెదిరింపు ఈ ఇమెయిల్ అందిన వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), తాజ్ భద్రతా పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. తాజ్ మహల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు(Delhi Police) గుర్తు తెలియని మెయిల్ ఐడి నుండి బెదిరింపు మెయిల్ అందింది. తాజ్ మహల్ను ఆర్డీఎక్స్తో పేల్చివేస్తామని దానిలో హెచ్చరించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ నకిలీదని తేలింది. దీనిపై సైబర్ సెల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న