‘ఉన్నావ్’ కేసులో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే
తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా దోషిని విడుదల చేయొద్దని స్పషీ్టకరణ
ఎమ్మెల్యే ‘ప్రజా సేవకుడు’ కాదని ఎలా అంటారు?
హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం విస్మయం
కానిస్టేబుల్ ప్రజా సేవకుడైనప్పుడు.. ఎమ్మెల్యేకు మినహాయింపు ఎందుకని ప్రశ్న
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతడికి బెయిల్ మంజూరు చేయడంతోపాటు కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దని అధికారులకు తేలి్చచెప్పింది. ఐపీసీ ప్రకారం ఎమ్మెల్యేను ‘ప్రజాసేవకుడి’గా పరిగణించలేమన్న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది. ఇది చట్టసభ సభ్యులకు మినహాయింపు ఇచ్చినట్లు అవుతుందన్నది.
ఎమ్మెల్యే ప్రజాసేవకుడు కాదా?
ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తోపాటు బాధితురాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సిందే. హైకోర్టు న్యాయమూర్తులు ఎంతో అనుభవజు్ఞలు, కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) నిర్వచనం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. చట్టం ప్రకారం ఒక కానిస్టేబుల్ ‘పబ్లిక్ సర్వెంట్’ అవుతారు.
అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడు మాత్రం ప్రజా సేవకుడు కాదా? ఎమ్మెల్యేను మినహాయించడం సరైందేనా? చట్టసభ సభ్యులను దీని నుంచి మినహాయించడం సరైన ది కాకపోవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా ఒక దోషి లేదా అండర్ ట్రయల్ ఖైదీకి బెయిల్ ఇస్తూ కింది కోర్టు లేదా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పుడు అతడి వాదన వినకుండా ఆ ఉత్తర్వుపై స్టే విధించలేమని తెలియజేసింది. మరో కేసులో సెంగార్ దోషిగా తేలి, ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడని పేర్కొంది. ఈ నెల 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉన్నావ్ కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని నిలిపివేస్తున్నామని స్పష్టంచేసింది.
బాధితురాలికి ప్రాణహాని ఉంది: తుషార్
సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘ఇది అత్యంత పాశవికమైన నేరం. ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ (15 ఏళ్ల 10 నెలలు). కేవలం ఏడేళ్ల జైలుశిక్ష పూర్తయిందన్న కారణంతో దోషికి బెయిల్ ఇవ్వడం సరికాదు. సవరించిన చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘నేరం జరిగిన సమయానికి ఈ చట్ట సవరణ రాలేదు కదా! ఆ తర్వాత వచ్చిన సవరణలను పాత కేసులకు ఎలా వర్తింపజేస్తాం?’ అని ప్రశ్నించింది.
దీనికి తుషార్ బదులిస్తూ.. ‘మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినప్పుడు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంతో పనిలేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల దృష్టిలో బలమైన స్థానంలో ఉంటారు. ఎవరైనా సాయం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తారు. అలాంటి నమ్మకమైన స్థానంలో ఉండి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరం కచ్చితంగా తీవ్రమైన లైంగిక దాడి కిందకే వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ విధుల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎలా శిక్షార్హుడో, ఎమ్మెల్యే కూడా అంతే’ అని వాదించారు.
సెంగార్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ‘సెంగార్ ఇప్పటికే బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ దోషిగా తేలారు. ఈ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. పలుకుబడి ఉన్న వ్యక్తి సెంగార్ బయటకొస్తే బాధితురాలికి, ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరు గుతుంది. ఆ బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలి’ అని కోర్టును కోరారు. ఎల్.కె. అద్వానీ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎంపీలు లేదా ఎమ్మె ల్యేలుగా పదవిలో ఉన్న వాళ్లను ప్రజా ప్రతినిధులుగానే పరిగణిస్తూ అప్పట్లో న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
సెంగార్ తరఫు న్యాయవాదుల వాదన
సెంగార్ తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. ‘ట్రయల్ కోర్టు సెంగార్ను పబ్లిక్ సర్వెంట్గా పరిగణించడం వల్లనే జీవిత ఖైదు విధించింది. ఐపీసీలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనాన్ని తీసుకొచ్చి పోక్సో చట్టానికి ఆపాదించడం న్యాయం కాదు. ఒక చట్టంలోని నిర్వచనాన్ని మరో చట్టానికి వర్తింపజేయకూడదు’ అని సాంకేతిక అంశాన్ని లేవనెత్తారు. అలాగే సెంగార్కు బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఆరోపణలు వస్తున్నాయని, టీవీల్లో కొందరు చర్చలు సాగిస్తున్నారని సెంగార్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
ఇరుపక్షాల వాదనలు తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎమ్మెల్యేను పబ్లిక్ సర్వెంట్ కాదనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ను నిలిపివేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని వెల్లడించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్కు నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో 2019 డిసెంబర్లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు(మరణించేదాకా జైలులోనే) విధించింది. మరోవైపు బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించాడు. ఈ కేసులోనూ సెంగాల్ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నావ్ అత్యాచారం కేసుతోపాటు సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఉన్నావ్ రేప్ కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల విచారించింది. సెంగార్ చేసిన నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సి) కింద ‘తీవ్రమైన లైంగిక దాడి’ పరిధిలోనికి రాదని అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 21 ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధి ‘పబ్లిక్ సర్వెంట్’ నిర్వచనం పరిధిలోకి రారని పేర్కొంది. సెంగార్ ఇప్పటికే ఏడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు, జీవిత ఖైదును కూడా రద్దు చేస్తున్నట్లు ఈ నెల 23వ తేదీన తీర్పునిచ్చింది.


