28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు | Sakshi
Sakshi News home page

సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

Published Tue, Dec 22 2020 12:34 PM

Sister Abhaya Murder Case: CBI Court Declared Verdict Today - Sakshi

సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్‌ థామస్ కొట్టూర్, నన్‌ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్‌23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్‌ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు

కేసు వివరాలు.. 1992లో సిస్టర్‌ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్‌ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్‌లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్‌లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్‌ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్‌. నన్‌ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది.

Advertisement
Advertisement