న్యూఢిల్లీ: ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తొలగించాలి" అని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, దీనిపై గళం వినిపించడమే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.
వ్యంగ్యాత్మక ఆన్లైన్ ఉద్యమంగా ప్రారంభమై, జనరేషన్-జీ వల్ల వేగంగా ఎదిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలు లేవు" అని చెప్పారు. నేటి నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. "నా తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాను. వారిని చివరిసారి కలిసి ఏడాదికి పైగా అయింది. గత 15 రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపుల కారణంగా ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తాను" అని ఎక్స్లో పేర్కొన్నారు.
"ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏమి సాధిస్తారని ప్రజలు అంటారు. కానీ వాటి ద్వారా మేము ఇంకా జీవించి ఉన్నామని నిరూపిస్తాం! ప్రభుత్వానికి మేము కేవలం కీటకాల్లా కనిపించవచ్చు. కానీ మేము జీవించి ఉన్నాం. మా హక్కుల కోసం పోరాడే సామర్థ్యం మాకు ఉంది" అని కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్లో పేర్కొంది.
కాగా, విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న దిప్కే శనివారం తెల్లవారుజామున భారత్కు చేరుకుని, నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్కు వెళ్లారు. నీట్-యూజీ, సీయూఈటీ, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ జీడీ వంటి ప్రధాన జాతీయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల చుట్టూ ఈ నిరసన సాగింది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షలకు సంబంధించిన వివాదాలు ప్రభావం చూపాయని పేర్కొంటూ, భారత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే యువత చేస్తున్న ఉద్యమంగా సీజేపీ తన ప్రచారాన్ని మలిచింది. ఈ ఉద్యమం ఆన్లైన్లో విపరీతంగా ఆదరణ పొందింది. తమకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని, సామాజిక మాధ్యమ వేదికల్లో బలమైన జనరేషన్-జీ అనుచర వర్గం ఉందని సంస్థ చెబుతోంది.
నిరసనకు ముందు సంస్థ తన నిర్మాణాన్ని అధికారిక రూపంలో ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టింది. సౌరవ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకాను అధికారిక ప్రతినిధులుగా ప్రకటించింది. వీరు మాధ్యమాలతో మాట్లాడనున్నారు.
ప్రతినిధులు నిరసన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని, జాతీయ జెండాలు, పుస్తకాలు తీసుకురావాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.
వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భద్రతా కారణాలు, ప్రజలకు అసౌకర్యం కలగొచ్చనే ఆందోళనల దృష్ట్యా, తాను వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి రావద్దని మద్దతుదారులను కోరారు. అరెస్టు సహా చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఉద్యమం రాజ్యాంగ పరిమితులలోనే కొనసాగుతుందని, శాంతియుత భిన్నాభిప్రాయ వ్యక్తీకరణపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ ఉద్యమంలో లడఖ్ ఉద్యమనేత సోనం వాంగ్చుక్ కూడా పాల్గొంటున్నారు.


