Rajiv Gandhi Khel Ratna Award Renamed As Major Dhyan Chand Khel Ratna Award - Sakshi
Sakshi News home page

రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు

Aug 6 2021 1:04 PM | Updated on Aug 7 2021 8:03 AM

Rajiv Khel Ratna Renamed As Major Dhyan Chand Khel Ratna Award - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు. ఈ పురస్కారం పేరు మారింది. ఈ అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా శుక్రవారం మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌లో ప్రకటించారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్‌ పేరు తొలగించి ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్‌ భారత హకీ దిగ్గజం. ధ్యాన్‌చంద్‌ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. అంతటి గొప్ప వ్యక్తి జయంతిని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్‌ వరకు వెళ్లి అద్భుత ప్రదర్శన చేసినా నిరాశ చెందారు. అయినా వారి పోరాటాన్ని దేశం కీర్తించింది. వీటన్నింటినీ చూస్తుంటే హాకీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హాకీ దిగ్గజంగా ఉన్న ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడంతో మళ్లీ హాకీ క్రీడకు మంచి రోజులు రానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement