స్వయం సమృద్ధ భారతే లక్ష్యం | PM Narend Modi launches Ek Ped Maa Ke Naam 2. 0 tree plantation drive | Sakshi
Sakshi News home page

స్వయం సమృద్ధ భారతే లక్ష్యం

Jun 6 2025 4:43 AM | Updated on Jun 6 2025 4:43 AM

 PM Narend Modi launches Ek Ped Maa Ke Naam 2. 0 tree plantation drive

ఎన్డీయే పథకాలతో పేదల జీవితాల్లో పెనుమార్పులు  

ప్రధాని మోదీ స్పషీ్టకరణ  

న్యూఢిల్లీ: దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. స్వయం సమృద్ధ, సమీకృత భారత్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ప్రతి పౌరుడికీ లభించాలన్నదే తమ ఆశయమని వివరించారు. 

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదల జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ కాలం ఈ నెల 9వ తేదీ నాటికి 11 ఏళ్లు పూర్తి కానుంది. మూడో టర్మ్‌లో తొలి ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

‘‘పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల్‌ యోజన, జన్‌ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో ప్రజలకు పక్కా నివాస గృహాలు, వంట గ్యాస్, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)తో చివరి లబ్ధిదారుడికి సైతం మేలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజేస్తాం. నేరుగా వారి వద్దకే వెళ్తాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.  

మన భూగోళాన్ని కాపాడుకుందాం...  
మనం నివసిస్తున్న ఈ భూగోళాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భూమిని రక్షించుకొనే విషయంలో అన్ని రకాల సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలన్నీ స్వప్రయోజనాలు పక్కనపెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కలపాలని సూచించారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదమని గుర్తుచేశారు. ప్లాస్టిక్‌ కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ           స్పృహ క్రమంగా పెరుగుతోందని, లక్షలాది మంది నిత్య జీవితంలో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌’ విధానం పాటిస్తున్నారని చెప్పారు.  

సిందూర్‌ మొక్క నాటిన ప్రధాని 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో సిందూర్‌ మొక్క నాటారు. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడానికి 1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళలు ఆయనకు ఈ మొక్క బహూకరించారు. ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు గుర్తుగా మోదీ సిందూర్‌ మొక్కను స్వహస్తాలతో నాటారు.

 సిందూర్‌ మొక్క మన దేశ మహిళల శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సిందూర్‌ మొక్క నాటే గొప్ప అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల గుజరాత్‌లోని కచ్‌లో పర్యటించినప్పుడు మహిళలు తనకు ఈ మొక్కను బహూకరించారని, 1971లో పాకిస్తాన్‌పై భారత్‌ సాగించిన యుద్ధంలో వారంతా అసాధారణ పరాక్రమం, దేశభక్తిని ప్రదర్శించారని ప్రశంసించారు. సిందూర్‌ మొక్క నాటిన వీడియోలు, ఫొటోలను మోదీ షేర్‌ చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement