సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌ | MUDA Scam: ED registers money laundering case against CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

Sep 30 2024 6:45 PM | Updated on Sep 30 2024 6:58 PM

MUDA Scam: ED registers money laundering case against CM Siddaramaiah

న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది.

ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా  కేసు నమోదు చేసింది. తద్వారా.. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం దక్కినట్లయ్యింది.

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్‌ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. 

అయితే కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement