కొందరిపై వేటు కొత్తవాళ్లకు చోటు? | Modi Government Cabinet Reshuffles | Sakshi
Sakshi News home page

కొందరిపై వేటు కొత్తవాళ్లకు చోటు?

Jun 6 2026 2:07 AM | Updated on Jun 6 2026 2:07 AM

Modi Government Cabinet Reshuffles

మోదీ కేబినెట్‌ ప్రక్షాళన ఖరారు.. 20న ముహూర్తం!

ధర్మేంద్ర ప్రధాన్‌కు పేపర్‌ లీక్‌ సెగ విమాన ప్రమాదాలు, పనితీరుపై అసంతృప్తితో రామ్మోహన్‌పై వేటు? 

ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంకు ఢిల్లీ లైన్‌ క్లియర్‌! 

తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు చేర్పులు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జూన్‌ 20న ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయి లో పనితనం కనబరచని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన కొనసాగనుంది.

ఈ రేసులో బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఒకరికి నేరుగా కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా కట్టబెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు హస్తినలో హాట్‌ టాపిక్‌గా మారింది. దేశాన్ని కుదిపేసిన ‘నీట్‌’ప్రశ్నపత్రం పేపర్‌ లీక్‌ వ్యవ హారం మోదీ ప్రభుత్వ పనితీరును ప్రశ్నార్థకంగా చేసింది. విపక్షాల నిరసనలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు కోడై కూస్తున్నాయి. 

రామ్మోహన్‌పై అసంతృప్తి! 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌ నాయుడి పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం, మహారాష్ట్రలో విమాన ప్రమాదాలు, విమాన చార్జీలు చుక్కలనంటడం వంటివి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా రామ్మోహన్‌ నాయుడిని తప్పిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల్లో ఒకరికి కేబినెట్‌ ర్యాంక్‌ ప్రమోషన్‌ దక్కే ఛాన్స్‌ ఉంది.

తెలంగాణ పరిస్థితి..  
దక్షిణాదికి తెలంగాణను సింహద్వారంగా భావిస్తున్న బీజేపీ 2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి మరో ఒకరిద్దరికి కేబినెట్‌లో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని.. కుమారుడి కేసు నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పదవికి గండం ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది.  

ఎవరి మంత్రి పీఠం భద్రం? 
ప్రస్తుతానికి మోదీ కేబినెట్‌లో కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి అగ్రశ్రేణి మంత్రుల స్థానాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం.  

ధర్మేంద్ర ప్రధాన్‌ స్థానంలో చోటు ఎవరికి? 
ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉండి, విద్యా రంగానికి సంబంధించిన లోతైన అవగాహన ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న కీలక నాయకులకు చోటు దక్కే ఆస్కారముంది. ఉత్తర భారతం లేదా ఒడిశా సమీకరణాలను బట్టి ఈ ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. 

బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? 
గతంలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వంటి మాజీ ముఖ్యమంత్రులను కేంద్రంలోకి తీసుకున్నట్లే ఈసారి సైతం సుదీర్ఘ అనుభవం ఉండి, రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్రంలో సేవలు అవసరమని భావిస్తున్న ఒక ప్రముఖ హిందీ ప్రాంతం లేదా పశి్చమ భారతానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరికి? 
బండి సంజయ్‌ను ఒకవేళ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పిస్తే తెలంగాణ నుంచి గెలిచిన మిగతా ఎంపీలలోని సీనియర్‌ లేదా సామాజిక సమీకరణాలకు సరిపోయే మరో నేతకు ఈసారి మోదీ కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు. 

రామ్మోహన్‌ను తప్పిస్తే? 
ఏపీలో ఎన్డీయే కూటమి పొత్తు ధర్మం పాటించనుంది.ఒకవేళ రామ్మోహన్‌ నాయుడును పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆయన స్థానంలో టీడీపీ తరఫున గెలిచిన కీలక లోక్‌సభ సభ్యులలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నాయని పార్టీ సీనియర్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఏపీ నుంచి ప్రమోషన్‌? 
ఈ ప్రమోషన్‌ రేసులో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు. ఒకవేళ టీడీపీ కోటాలోనే మార్పులు చేయాలని భావిస్తే ఈయనకు కేబినెట్‌ ర్యాంకుకు ప్రమోషన్‌ ఇచ్చే అవకాశం పరిశీలించవచ్చు. ఒకవేళ బీజేపీ ఏపీలో తన సొంత బలాన్ని, సామాజిక సమీకరణాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తే ప్రస్తుతం భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగావున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ కేబినెట్‌ హోదా కల్పంచే దిశగా కూడా అధిష్ఠానం ఆలోచించే అవకాశం ఉంది. ఏదేమైనా మరో వారం, పది రోజుల్లోపు కేబినెట్‌ కూర్పుపై స్పష్టత వచ్చే ఆస్కారముంది.  

Advertisement
 
Advertisement
Advertisement