‘వారికీ ట్రంప్‌ గతే’ 

Mehbooba Mufti Says Trump Has Gone So Will BJP - Sakshi

శ్రీనగర్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాటలోనే బీజేపీని కూడా ప్రజలు ఇంటిబాట పట్టిస్తారని జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ అన్నారు. అమెరికాలో ఏం జరిగిందో చూడండి..బీజేపీకీ అదే గతి పడుతుందని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వి యాదవ్‌పై మెహబూబా ముఫ్తీ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో సరైన దృక్పథంతో ముందుకు వెళ్లిన తేజస్వి యాదవ్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. జమ్ము కశ్మీర్‌లో భూముల కొనుగోలుకు భారతీయులందరినీ అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. తమ వనరులను తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని, కశ్మీరీ పండిట్లకు భారీ వాగ్ధానాలు చేసిన బీజేపీ ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.  చదవండి : ఇకపై కశ్మీర్‌లో భూములు కొనొచ్చు.. 

జమ్ము కశ్మీర్‌ను బీజేపీ అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు. జమ్ము కశ్మీర్‌లో యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు ఆయుధాలు చేబూనడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఘటనలపై మెహబూబా స్పందిస్తూ త్రివర్ణ పతాకం కోసం వేలాది మంది ప్రాణాలొడ్డుతున్నారని, భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య శాంతికి జమ్ముకశ్మీర్‌ వారథిగా మారాలని ఆకాంక్షించారు. ఆర్టికల్‌ 370 హిందువులు లేదా ముస్లింలకు సంబంధించిన అంశం కాదని, ఇది జమ్ము కశ్మీర్‌ స్వతంత్రతకు చిహ్నంగా చూడాలని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రజలు వారి భవిష్యత్‌ పట్ల ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. 

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top