BJP: టార్గెట్‌ 50 శాతం | Lok sabha elections 2024: BJP plans to Vote Percentage increased own Strategy | Sakshi
Sakshi News home page

BJP: టార్గెట్‌ 50 శాతం

Apr 5 2024 6:18 AM | Updated on Apr 5 2024 6:18 AM

Lok sabha elections 2024: BJP plans to Vote Percentage increased own Strategy - Sakshi

వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే 370కి పైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుని దాన్ని సాధించేలా వ్యూహరచన చేస్తోంది. మోదీ కరిష్మాకు తోడు పదేళ్ల పాలన, అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గతంలో కాస్త తేడాతో ఓడిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

కఠిన సవాలే
స్వతంత్ర భారత చరిత్రలో 17 లోక్‌సభ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీజేపీ, ఒకసారి జనతాపార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించాయి. కానీ ఏ పారీ్టకీ 50 శాతం ఓట్లు రాలేదు! 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన 48.1 శాతమే ఇప్పటిదాకా రికార్డు. ఆ తర్వాత ఏ లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మెజారిటీ కానీ, 40 శాతం ఓట్లు కానీ రాలేదు. ఇక బీజేపీ 2014లో 31.4 శాతం ఓట్లతో 282 సీట్లు, 2019లో 37.7 శాతం ఓట్లతో 303 స్థానాలు సాధించింది. ఈసారి మరో 12 శాతం ఓట్ల కోసం చిన్నా పెద్దా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

ఆ 100 స్థానాలపై గురి
50 శాతం ఓట్లు, 370 ప్లస్‌ సీట్ల సాధనకు బీజేపీ రెండంచెల వ్యూహం పన్నింది. 2014లో నెగ్గి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన 35 స్థానాలపై ఫోకస్‌ పెంచింది. వీటిలో ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 14 స్థానాలున్నాయి. బిహార్‌లో 6, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. వీటిని తిరిగి కైవసం చేసుకునేందుకు స్థానిక పారీ్టలతో పొత్తులు పెట్టుకుంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలొ దింపుతోంది. ఇక కేవలం 2 నుంచి 3 శాతం ఓట్ల తేడాతో ఓడిన మరో 72 స్థానాలనూ బీజేపీ గుర్తించింది.

అక్కడ సొతంగా బలం పెంచుకునే యత్నాలకు పదును పెట్టడంతో పాటు జేడీ(ఎస్‌), జేడీ(యూ), ఎల్జేపీ, పీఎంకే, ఆరెడ్డీ, తమిళ మానిల కాంగ్రెస్‌ వంటివాటితో పొత్తులు పెట్టుకుంది. పైరవీలు, సీనియార్టీలను పక్కన పెట్టి గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏకంగా 103 మందికి పైగా సిట్టింగులను తప్పించింది. వారిలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖీ, అశి్వనీకుమార్‌ చౌబే తదితరులు, హర్షవర్ధన్, సదానందగౌడ వంటి మాజీలున్నారు. వరుణ్‌గాంధీ వంటి నేతను కూడా మొహమాటం లేకుండా పక్కన పెట్టేశారు. అనంత్‌కుమార్‌ హెగ్డే, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వంటి వివాదాస్పదులకూ మొండిచేయి చూపారు.

Advertisement
 
Advertisement
Advertisement