బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ
నాలుగున్నర గంటలపాటు విచారణ, 100 ప్రశ్నలు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, 92 ఏళ్ళ ఎల్కే అడ్వాణీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరవగా, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, నాలుగున్నర గంటలపాటు జరిగిన ఈ విచారణలో, ఎల్కే అడ్వాణీని సీబీఐ ప్రత్యేక కోర్టు 100కు పైగా ప్రశ్నలను అడిగింది. అడ్వాణీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారని, ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. బుధవారం హోం మంత్రి అమిత్షా, ఎల్కే అడ్వాణీతో అరగంట పాటు సమావేశమయ్యారు. రోజువారీ విచారణ చేస్తున్న కోర్టు, ఆగస్టు 31లోగా తీర్పును ప్రకటించాల్సి ఉంది.