అంత్యక్రియల కోసం 27న తల్లిదండ్రులకు అవశేషాలు
సీబీఐ కోర్టు ఆదేశాలు
విజయవాడ లీగల్: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన అనంతరం కేసును మూసివేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు.
తమ కుమార్తె అవశేషాలను అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తమ న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ ద్వారా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన సీబీఐ కోర్టు తుది ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం బాధిత తల్లిదండ్రులు, సీబీఐ దర్యాప్తు అధికారి కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టులో గుర్తింపు పంచనామా జరిపిన అనంతరం, అవశేషాలను ప్రాసిక్యూషన్ అవసరమైన భద్రత, తగిన వాహన సదుపాయం కల్పించి తల్లిదండ్రులతో పాటు వారి స్వస్థలమైన తెనాలికి పంపాలని కోర్టు సూచించింది.
తెనాలిలోని శ్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు రికార్డ్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని జడ్జి ఉత్తర్వుల్లో నిర్దేశించారు.


