పట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ప్రముఖ విద్యావేత్త, యూట్యూబర్ ఖాన్ సర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ముసల్లాపూర్ హాట్ సమీపంలోని ఈ కేంద్రం వద్ద మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం బుధవారం ఉదయం కోచింగ్ సెంటర్ వెలుపల భారీ సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు.
సీఎం సమ్రాట్ చౌదరీకి ఖాన్ సర్ విజ్ఞప్తి
ఈ ఘటనపై ఖాన్ సర్ స్పందిస్తూ, తమకు భద్రత కల్పించాలని బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీని కోరారు. ముఖ్యమంత్రిపై, రాష్ట్ర పరిపాలనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దాదాపు 50-60 మంది పోలీసు సిబ్బంది తమ రక్షణ కోసం ఇక్కడే ఉన్నారని, పోలీసుల వేగవంతమైన చర్యల పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. పట్నా ఎస్ఎస్పీ కార్తికేయ కె. శర్మ, ఎస్పీ సిటీ భాను ప్రతాప్ సింగ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థులకు విద్యను అందించడమే తన లక్ష్యమని, అయితే కొందరు వ్యక్తులు ఈ ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని, ఇటువంటి సిగ్గుచేటు చర్యలకు పాల్పడవద్దని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.
రౌడీమూకల ఘాతుకం.. గార్డుపై దాడి
ఎదురుగా ఉన్న మరో కోచింగ్ సెంటర్కు చెందిన వ్యక్తులే ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దుండగులు సెక్యూరిటీ గార్డుపై భౌతిక దాడికి పాల్పడి, ఆపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడిన గార్డు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. విద్యార్థులు కోచింగ్ సెంటర్ వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు, ఖాన్ సర్ సంస్థకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
12 మంది నిందితుల గుర్తింపు
ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఘటనా స్థలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని, సోషల్ మీడియా వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ సిటీ దీక్ష తెలిపారు. ఇప్పటివరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 నుండి 12 మందిని గుర్తించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్థానికుల, బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


