రాంచీ: కాల్పుల మోతతో జార్ఘాండ్ అరణ్యాలు దద్దరిల్లాయి. హజారీబాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ముట్టడి అనంతరం భద్రతా బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో నక్సలైట్ కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఖపియా అడవి ప్రాంతంలో 209 కోబ్రా బెటాలియన్ బృందాలు యాంటీ-నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. చీతా రాజేష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, చీతా అభిషేక్ యాదవ్తో కలిసి ఉన్న బృందం మావో యిస్టు గ్రూప్ను ఎదుర్కొంది. నక్సలైట్ బృందానికి సహదేవ్ మహతో నేతృత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


