
ఆందోళన వ్యక్తం చేస్తున్న గివురి గ్రామ రైతులు
జయపురం: మండీలలో ధాన్యం కొనుగోలు చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని జయపురం సమితిలోని గివురి గ్రామ రైతులు హెచ్చరించారు. మండీలకు తరలించిన ధాన్యాన్ని అక్కడి సిబ్బంది, ల్యాంప్ అధికారులు ఏదో కారణం చెప్పి, కొనడం లేదన్నారు. దీంతో కొన్ని నెలల పాటు ధాన్యం అలాగే ఉండిపోయి పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల కొనుగోళ్లకు సైతం డబ్బులు లేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు దళారీలకు తక్కువ ధరకే ధాన్యం అమ్మి, నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ధాన్యం కొనుగోలుకు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు.